మూఢనమ్మకాలను పెంచేలా వర్ణ యాగం నిర్వహించడం విడ్డూరం
మూఢనమ్మకాలను పెంచేలా వర్ణ యాగం నిర్వహించడం విడ్డూరం
రాకెట్, హైటెక్ యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ణ యాగం చేయడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో మంగళవారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం.. మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను నివారించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు సైతం కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువల రెండో దశ పనులకు నిధులు మంజూరైనప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పనులను సకాలంలో పూర్తి చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఎం మండల కమిటీ అధ్యక్షుడు అరూరి శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, నెలికంటి నర్సింహా, పంది నరేష్, కల్లూరి కుమారస్వామి, మెట్టు నర్సింహా, గుడిసె లక్ష్మీనారాయణ, కందగట్ల గణేష్, జిట్ట స్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.