నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ఎస్బీఐ గణపవరం బ్రాంచ్ మోసాల కేసులో తూము కేశవ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ
రాజమహేంద్రవరం, ఆగస్టు 20: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణపవరం బ్రాంచ్లో జరిగిన నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు తూము కేశవ శ్రీనివాస్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర కారాగారానికి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన తూము కేశవ శ్రీనివాస్ తక్కువ విలువైన భూములకు అధిక విలువ చూపించి, బ్యాంకు ప్యానెల్ వాల్యూర్లు, అధికారులతో కుమ్మక్కై రుణాల పేరుతో బ్యాంకును మోసం చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కొంతకాలంగా పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది.
ఎస్బీఐ గణపవరం శాఖకు సంబంధించిన పలు కేసుల్లో సుమారు రూ.1.70 కోట్ల మేర ఆర్థిక మోసం జరిగినట్లు బ్యాంకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది బ్యాంకు సిబ్బందిని సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. భూముల విలువలను అధికంగా చూపించిన బ్యాంకు ప్యానెల్ వాల్యూర్లపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
తూము కేశవ శ్రీనివాస్పై సీఐడీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు:
క్రైం నం.18/2022 – ఎస్బీఐ గణపవరం శాఖ
క్రైం నం.25/2022 – ఎస్బీఐ గణపవరం శాఖ
క్రైం నం.32/2024 – ఎస్బీఐ గణపవరం శాఖ
క్రైం నం.34/2022 – ఎస్బీఐ గణపవరం శాఖ
ఈ కేసుల్లో తూము భాస్కర శివకుమార్, తూము సత్య సోమసుందరి, తూము నరేంద్ర కుమార్, గోపిశెట్టి మాధురి, వి. వనజాక్షి, వి. నరేంద్ర, కె. రామమోహనరావు తదితరులు నిందితులుగా ఉన్నారు.
ప్రధాన నిందితుడి అరెస్ట్లో కృషి చేసిన విశాఖపట్నం, రాజమహేంద్రవరం సీఐడీ అధికారులను డీజీపీ సీఐడీ అభినందించారు.