ఊటుకూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ ఘనంగా
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో స్వర్గీయ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడిగా ఆయనను కొనియాడారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా రంగా సేవలు చిరస్మరణీయమని అన్నారు.
రంగా రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, ఆయన పోరాట పటిమ, యువతలో నింపిన స్ఫూర్తి గురించి సభలో వివరించారు. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా భారీ బహిరంగ సభను గుర్తు చేస్తూ, వేలాది మంది ప్రజలను ఆకట్టుకున్న ఆ సభ ఆయన ప్రజాదరణకు నిదర్శనమని చెప్పారు.
నేటి యువత రంగా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా సమాజ సేవకు అవసరమైన విలువలు అలవడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక, యువజన సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు ఘన నివాళులు అర్పించారు.