పాఠాలు చెప్పిన టీచర్నే హతమార్చిన విద్యార్థులు
పాఠాలు చెప్పిన టీచర్నే హతమార్చిన విద్యార్థులు
నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే దోపిడీ కోసం హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఈ కేసును సవాలుగా తీసుకుని దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ప్రింట్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. దాదాపు 40 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.
‘బాబు’ అనే ఒక్క మాటతో కీలక మలుపు
హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరిగా “బాబు” అని పలికినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో, ఆమె ఎవరిని ఉద్దేశించి “బాబు” అని పిలిచారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. పాఠశాలకు వరుసగా ఆరు రోజులు సెలవులు ఉండటంతో విచారణలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఒక్కొక్కరిని పోలీసులు విచారించారు.
ఈ క్రమంలో రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో కొత్తగా జల్సాలకు అలవాటు పడిన ఐదుగురు విద్యార్థులపై పోలీసులు మరింత దృష్టి సారించారు. సీసీ కెమెరా ఫుటేజీతో అనుమానిత విద్యార్థుల కదలికలను సరిపోల్చి కీలక ఆధారాలను సేకరించారు.
బైక్పై వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లిపాకల ఎక్స్రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులను దొనియాల ఎక్స్రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి తనిఖీ చేయగా లోదుస్తుల్లో నగదు దాచుకున్నట్లు గుర్తించారు.
వారి వద్ద లభించిన రూ.1.54 లక్షల నగదులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా, ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగదును అపహరించినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలు
కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్ఐ రమేష్, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ నరసింహులు, గుర్రంపొడు ఎస్ఐ వెంకన్న, సీసీఎస్ ఎస్ఐ సురేష్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు.
నేరస్థులు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాలను ఛేదించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన ప్రత్యేక పోలీసు బృందాల కృషిని ఆయన అభినందించారు.