పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబీస్ వ్యాక్సిన్ వేయించాలి: మోరంపూడి శ్రీనివాసరావు
చాట్రాయి, జులై 6: కుక్క కరవడం వల్ల వచ్చే రేబీస్ వ్యాధిని నివారించాలంటే ప్రతి పెంపుడు కుక్కకు తప్పనిసరిగా రేబీస్ వ్యాక్సిన్ వేయించాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు సూచించారు.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఎల్ఎస్ఏ పవన కుమారి ఆధ్వర్యంలో రేబీస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను "జూనోటిక్ వ్యాధులు" అని పిలుస్తారని తెలిపారు.
జంతువులు, పక్షుల ద్వారా వ్యాపించే అంటువ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుక్కలు, పిల్లులు కరవడం వల్ల రేబీస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే పశువుల ద్వారా బ్రూసెల్లోసిస్, ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా లెప్తోస్పిరోసిస్, పక్షుల ద్వారా ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైన వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడానికే ప్రతి ఏడాది ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నేత కొత్తగుండ్ల రమేష్, ఫిరంగి పుల్లయ్య, నాయుడు రాంబాబు, ఎల్ఎస్ఏ పవన కుమారి, గోపాల మిత్ర విస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఏహెచ్ఏ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.