చింతలపూడిలో అంతర్గత రహదారుల నిర్మాణంలో జాప్యం ఎందుకు?
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి నగరంలోని అంతర్గత రహదారుల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ఎటు చూసినా అధ్వాన్నంగా మారిన రహదారులు ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు అంతర్గత రహదారులను నిర్లక్ష్యం చేశాయని విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నప్పటికీ, ప్రజలు నిత్యం ఉపయోగించే అంతర్గత రహదారులపై అదే స్థాయిలో దృష్టి ఎందుకు పెట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే చాలు రహదారుల దుస్థితి మరింత తీవ్రమవుతోంది. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణించడం ప్రజలకు సవాలుగా మారింది.
ముఖ్యంగా బట్టు వారి గూడెం, బాల వారి గూడెం రోడ్డు, దేవుడు మాన్యం కాలనీ, వెలంపేట కాలనీ, వడ్రిగూడెం కాలనీ, వైయస్సార్ కాలనీ ఎగువ, దిగువ ప్రాంతాలు, బట్టు వారి గూడెం పరిసరాలు, సుప్రియన్పేట, ఆర్కే నగర్, మోడల్ కాలనీ ప్రాంతాల్లో సరైన అంతర్గత రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, బురదమయమైన రోడ్లు, రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.