పెనుగొలనులో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ఘనంగా
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం బాబు జగ్జీవన్ రామ్ 1935లో "ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్"ను స్థాపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా నిస్వార్థ సేవలు అందించిన జగ్జీవన్ రామ్, కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో విశేష కృషి చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పంది లక్ష్మయ్య, మీనుగు రామకృష్ణ, కుంచం నాగార్జున, చల్ల రామకృష్ణ, మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడీ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.