పెనుగొలనులో ఘనంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, ఆరు బాలల మినీ నవలలు, ఐదు బాలల కథా సంపుటాలు, మూడు వ్యాస, ఆత్మకథ సంపుటాలు, ఎనిమిది నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
బాలసాహిత్య రంగంలోనూ ఆయన విశేష కృషి చేశారని, 2012లో ఆయన రచించిన నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం తెలుగు సాహిత్యానికి గర్వకారణమని తెలిపారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ, కళాప్రపూర్ణ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో పాటు అనేక సన్మానాలు అందుకున్నారని గుర్తు చేశారు.
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మహోన్నత రచయితగా రావూరి భరద్వాజను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.