పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం
పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ పోలవరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల రక్షణ, వేసవి జాగ్రత్తలు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతి వేగం ప్రాణాలకు ప్రమాదకరమని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాయాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు. వాట్సాప్ లేదా మెసేజ్లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ వినియోగంపై వివరించారు. ఆపద సమయంలో యాప్ ఉపయోగిస్తే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కాలువలు, బావుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు బయట ఆడుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు.గ్రామంలో జూదం, గంజాయి, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.గ్రామస్తులు చట్టాలపై అవగాహన పెంచుకుని, పోలీసులకు సహకరించి పోలవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ కోరారు.