ప్రభుత్వ బడికి పంపండి.. పన్ను మినహాయింపు పొందండి
ప్రభుత్వ బడి బలోపేతానికి సర్పంచ్ వినూత్న నిర్ణయం..
ప్రభుత్వ బడి బలోపేతానికి నార్కట్ పల్లి మండల పరిధిలోని గోపలాయపల్లి గ్రామ సర్పంచ్ మచ్చ జయసుధ ముత్యాలు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని చదువుకునే విద్యార్థులను ప్రభుత్వ బడికి పంపిస్తే ఇంటి పన్ను రద్దుతో పాటుగా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనందున గతంలో కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా అవుతుందని కారణంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ పాలకవర్గం సైతం తీర్మానం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సైతం వారి కుటుంబాలకు అందించాలని నిర్ణయం కూడా తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ తమ గ్రామంలోని ప్రభుత్వ బడిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం ఇంటి పన్ను రద్దులో ఏమైనా ఇబ్బందులు ఉంటే సొంత నిధులు లేదా గ్రామంలోని దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనకడుగు వేయకుండా గ్రామంలోని ప్రభుత్వ బడిని కాపాడుకుంటామన్నారు. మా ఒక్క గ్రామమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తీసుకుని నిర్ణయాలకు ఉన్నతాధికారులు సైతం అండగా ఉండాలని కోరారు. అధికారులు ఇటువంటి వినూత్న నిర్ణయాలకు సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమై పేదల విద్యార్థులకు విద్య దగ్గరవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నిరంజన్, ఉపసర్పంచ్ అరిగెల నరసింహ మమత, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.