పదో తరగతి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం.. ఘన సన్మానం
చిట్యాల మండలం | నల్గొండ జిల్లా | N Today News
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
గ్రామానికి చెందిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) సభ్యులు నన్నూరి ఉపేందర్ రెడ్డి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అలాగే శాలువాతో సత్కరించి పుస్తకాలను బహుమతిగా అందించారు.
ఈ సందర్భంగా నన్నూరి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భాషలపై పట్టు సాధించడం ద్వారా అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా సమానంగా అవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.