రాచమళ్ల రామచంద్రం జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం
రాచమళ్ల రామచంద్రం జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం
చిట్యాల: సీపీఎం సీనియర్ నాయకులు, వట్టిమర్తి మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాచమళ్ల రామచంద్రం జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాచమళ్ల రామచంద్రం రెండో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దివంగత నేత, అమరజీవి నర్రా రాఘవరెడ్డి నిర్వహించిన రాత్రి పాఠశాలలో అక్షరాలు నేర్చుకున్న రామచంద్రం, సుమారు 27 సంవత్సరాల పాటు వట్టిమర్తి గ్రామ సర్పంచ్గా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించారని తెలిపారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావులేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని కొనియాడారు.
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వసతుల కల్పనలో రామచంద్రం కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఐతరాజు యాదయ్య, గుడిసె లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మేడి యాదయ్య, పాలమాకుల అర్జున్, బొడ్డు బాబురావు, జిట్ట స్వామి తదితరులు పాల్గొన్నారు.