రిపోర్టర్ సత్యానందం కుటుంబానికి దాతల అండ.......
రిపోర్టర్ సత్యానందం కుటుంబానికి దాతల అండ.. పిల్లల భవిష్యత్తుకు రూ.4.50 లక్షల భరోసా
ముగ్గురు పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్లు.. కుటుంబ సభ్యులకు బాండ్ల అందజేత
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, బోనకల్:
గోవిందాపురం గ్రామానికి చెందిన రిపోర్టర్ మంద సత్యానందం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి మిత్రులు, దాతలు ఆర్థిక అండగా నిలిచారు. సత్యానందం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ జిల్లా నాయకుడు వల్లంకొండ రాంబాబు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం సేకరించారు.
మిత్రులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సత్యానందం కుటుంబానికి, ముగ్గురు పిల్లలకు సహాయం చేయాలని పిలుపునివ్వగా సుమారు 200 మంది స్పందించి రూ.4,52,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని లక్ష్మీపురం సొసైటీలో పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి శుక్రవారం కుటుంబ సభ్యులకు బాండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మాదినేని వీరభద్రరావు, సర్పంచ్ మంద కరుణ, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు పాల్గొని బాండ్లను అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేకరించిన ఆర్థిక సహాయాన్ని పిల్లల చదువులు, భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. సత్యానందం అకాల మరణంతో ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కుటుంబానికి తక్షణ సహాయం అందించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తుకు శాశ్వత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఒక కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
సత్యానందం కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మానవత్వానికి ఈ సహకారం నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వల్లంకొండ సురేష్, కొమ్ము శ్రీనివాసరావు, ఇరుగు జానేష్, తమ్మారపు లక్ష్మణరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, ఎర్రబోయిన అప్పారావు, నల్లమోతు నాగేశ్వరరావు, ముత్తరపు రవి, మంద జాన్, కల్యాణపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.