రూపా రెడ్డి హత్యకు నిరసనగా చిట్యాలలో ట్రస్మా ర్యాలీ
రూపా రెడ్డి హత్యకు నిరసనగా చిట్యాలలో ట్రస్మా ర్యాలీ
ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ చిట్యాల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యా రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, పాఠశాల యాజమాన్యాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ పాఠశాలల ప్రతినిధులు పోలీస్, మున్సిపల్ అధికారులకు ఈ సందర్భంగా మెమోరాండం సమర్పించారు.
రూపా రెడ్డి దారుణ హత్యను మండలంలోని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెమోరాండంలో పేర్కొన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రధానంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ రూపా రెడ్డి కుటుంబానికి పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి తగిన భద్రతా చర్యలు కల్పించాలని కోరారు. పాఠశాలల వద్ద భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై బెదిరింపులు లేదా దాడులు జరిగితే వెంటనే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఉపాధ్యాయుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, “ఉపాధ్యాయుల భద్రత విద్యా వ్యవస్థకు భద్రత” అనే భావనతో ఈ అంశంపై ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా మండల శాఖ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్, నాయకులు గట్టు అలెగ్జాండర్ రెడ్డి, పెద్ది నరేందర్, ప్రకాష్, జె వేణుగోపాల్ రెడ్డి, బొడిగె విజయ్, బొడిగె రవి, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు