సారిపల్లిలో వీధి దీపాల దుస్థితి – పంచాయతీ పాలనపై ప్రజల ఆగ్రహం
ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరా? ప్రజల భద్రతపై పంచాయతీకి ఇంత నిర్లక్ష్యమా?
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గ్రామస్తులు పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో ప్రధాన వీధులు, అంతర్గత వీధులు చీకటిలో మగ్గుతున్నా అధికారులు స్పందించకపోవడం పంచాయతీ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రజలు ఫిర్యాదు చేయాలి… అధికారులు వినాలి… సమస్య పరిష్కరించాలి — ఇదే కనీస పరిపాలనా బాధ్యత. కానీ సారిపల్లిలో మాత్రం ఫిర్యాదులు చేస్తున్నా సమస్య అలాగే ఉండటం దేనికి సంకేతం? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల నుంచి పంచాయతీకి వివిధ రూపాల్లో నిధులు వస్తున్నప్పుడు, ప్రజలకు కనీస అవసరమైన వీధి దీపాల నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చీకటి కారణంగా రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరిది? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
సమస్యను పలుమార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే మేల్కొంటారా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు, ఏయే ప్రాంతాల్లో లైట్లు పనిచేయడం లేదో ప్రత్యేకంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలపై ఇకనైనా నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని సారిపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.