శక్తి యాప్ పై అవగహన సదస్సు
శక్తి యాప్ పై అవగహన సదస్సు
బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, హెల్ప్లైన్ నంబర్లు మరియు శక్తి యాప్పై అవగాహన కల్పించిన చిత్తూరు జిల్లా శక్తి టీం పోలీసులు.
మహిళలు మరియు బాలికలకు ఎంతో ఉపయోగపడే శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ, శక్తి యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్న శక్తి టీం పోలీసులు.
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, మహిళా డీఎస్పీ శ్రీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో శక్తి బృందాలు మరియు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ గురువారం చిత్తూరు పట్టణంలోని కృష్ణవేణి మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, బాల్యవివాహం ఒక పెద్ద సామాజిక సమస్య అని, బాలికలకు 18 సంవత్సరాలు పూర్తికాకముందే వివాహం చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదురుకావడం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని వివరించారు. బాలికలు తమ చదువుపై దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
ఈవ్ టీజింగ్కు పాల్పడటం చట్టవిరుద్ధమని, మహిళలు, బాలికలను వేధించే వ్యక్తులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యార్థినులు ఎవరైనా తమను వేధించినా, వెంబడించినా లేదా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ నంబర్ను సంప్రదించాలని, పిల్లల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన సమస్యలు, వేధింపులపై 181 మహిళా హెల్ప్లైన్ను సంప్రదించవచ్చని అవగాహన కల్పించారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందించిన శక్తి యాప్ ఎంతో ఉపయోగకరమైనదని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్లోని SOS సౌకర్యాన్ని వినియోగించడం ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చని వివరించారు. మహిళలు, బాలికలు తమ భద్రత కోసం శక్తి యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లోనై డ్రగ్స్ను ప్రయత్నించవద్దని విద్యార్థులకు సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఇందుకోసం 1972 హెల్ప్లైన్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను దాచిపెట్టకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులతో పంచుకోవాలని, మహిళలు మరియు బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వెంకటేశ్వరులు, డీఐఈఓ చిత్తూరు ఏ. రఘుపతి, కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సరిత, ఈగల్ టీం సభ్యులు కుమార్ మరియు గిరి, శక్తి టీం సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.