టీటీడీ కళ్యాణ మండపం స్థలాన్ని పరిరక్షించాలి
టీటీడీ కళ్యాణ మండపం స్థలాన్ని పరిరక్షించాలి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రతిపాదిత టీటీడీ కళ్యాణ మండపం కోసం ప్రజల విరాళాలతో కొనుగోలు చేసిన సర్వే నెం.649లోని 1 ఎకరం 12 గుంటల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, జమాండ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుమారు 26 ఏళ్ల క్రితం కళ్యాణ మండపం నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిని సేల్ అగ్రిమెంట్ ప్రకారమే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి అదే స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాలని వారు కోరారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజా ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ప్రజల ముందు వాస్తవాలను వెల్లడించి భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే టీటీడీ స్థలానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై విలేకరుల పై పరువు నష్టం దావా వేస్తానని చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ప్రజా సమస్యలపై వచ్చిన వార్తలకు వాస్తవాలతో సమాధానం చెప్పాల్సిందిపోయి మీడియాను బెదిరించడం సరికాదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్.కే. షబానా అజీముద్దీన్ ఆగు అశోక్ పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.