ఉమామహేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
ఉమామహేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని చారిత్రక శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సోమవారం నాగుల పంచమి సందర్భంగా శిలాన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దకాపర్తిలోని ఈ పురాతన శివాలయానికి సుమారు 600–700 సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాధిపతి గోన గన్నారెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు వారు పేర్కొన్నారు. కాలక్రమంలో ముస్లిం దండయాత్రలతో ఆలయంలోని శివలింగం, ప్రాణవట్టం, నంది, వినాయకుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసమై, ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరిందన్నారు. ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు పునర్నిర్మాణi కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ కమిటీ రూపొందించిన నూతన ఆలయ పునర్నిర్మాణ నమూనా కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేద పండితులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణ మధుసూదన్ గుప్తా, ఉపాధ్యక్షులు చింతకింది తిరుమలయ్య, ఏర్పుల మల్లీశ్వరి వెంకటేశం, కార్యదర్శి నీలకంఠం నరేష్, కోశాధికారి నారాయణ రమేష్ గుప్తా, కమిటీ సభ్యులు ఏర్పుల సత్తయ్య, ఏదుల్ల లక్ష్మమ్మ, గుజ్జర్ యాదగిరి, ఏర్పుల లక్ష్మమ్మ, ఆవుల జానయ్య, బండారి వెంకన్న, నల్లవెల్లి బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.