విద్యార్థుల వీడియోకు వెంటనే స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. బీసీ హాస్టల్ రహదారి సమస్య పరిష్కారానికి హామీ
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు, జూలై 3: జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సమీప బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వీడియో సందేశం ద్వారా ఏలూరు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.
విద్యార్థుల సమస్యపై ఆరా తీసిన ఎంపీ, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్కు ఫోన్ చేసి, హాస్టల్ వద్ద పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. దీంతో కొండ్రెడ్డి కిషోర్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మున్సిపల్ కమిషనర్ కె. వెంకటరమణ, ఎమ్మార్వో జోజి తదితర అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం బీసీ హాస్టల్ను సందర్శించారు.
హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లే మట్టిరహదారిని పరిశీలించిన అధికారులు, వర్షాలు కురిసినప్పుడు అది పూర్తిగా బురదమయంగా మారి విద్యార్థులు నడవలేని పరిస్థితి ఏర్పడుతోందని గుర్తించారు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా మారిన దృశ్యాలను కొండ్రెడ్డి కిషోర్ బృందం ఫోన్ ద్వారా ఎంపీకి వివరించింది.
దీనిపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున వర్షాలు తగ్గిన వెంటనే ముందుగా గ్రావెల్తో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయించి, విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తమ సమస్యను వెంటనే గుర్తించి స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, అధికారులకు బీసీ హాస్టల్ విద్యార్థులు, వార్డెన్ కృతజ్ఞతలు తెలిపారు.