వరకట్న వేధింపులు, కుల దూషణ కేసులో నలుగురికి 6 నెలల జైలు
వరకట్న వేధింపులు, కుల దూషణ కేసులో నలుగురికి 6 నెలల జైలు
నల్లగొండ: వరకట్న వేధింపులు, కుల దూషణకు సంబంధించిన కేసులో నలుగురు నిందితులకు నల్లగొండ ప్రత్యేక సెషన్స్ కోర్టు శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ వెల్లడించారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో క్రైమ్ నంబర్ 24/2021గా కేసు నమోదైంది. ఈ కేసులో కల్లూరి స్వామినాథ్ ప్రమీల కల్లూరి యాదయ్య కల్లూరి ఎల్లయ్యలపై ఐపీసీ 498-ఏ, వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్లు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1)(r)(s) కింద అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన ఎస్సీ/ఎస్టీ కోర్టు కమ్ II అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. ఐపీసీ 498-ఏ కింద ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3 కింద మరో 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరో 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మూడు నేరాలకు కలిపి ఒక్కొక్కరికి 18 నెలల శిక్ష విధించినప్పటికీ, శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితులు 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నలుగురికి కలిపి మొత్తం రూ.12 వేల జరిమానా విధించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి ఆధారాలను కోర్టుకు సమర్పించిన ఎస్ఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఎస్డీపీఓ జి. వెంకటేశ్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహలతో పాటు ప్రస్తుత ఎస్డీపీఓ కె. శివరాం రెడ్డి, సీఐ కె. ఆది రెడ్డి, ఎస్ఐ బి. శివ ప్రసాద్, కోర్టు డ్యూటీ, లైజన్ అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తు చేపట్టి, పటిష్టమైన ఆధారాలను సేకరించి బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.