వర్షాకాలంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి పెనుగొలనులో 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం
పెనుగొలను, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం నిర్వహించారు.
వైద్య అధికారిణి శశిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, జ్వరం తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్య అధికారిణి శశిప్రియ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జ్వరం, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ బి.హెచ్. సురేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా, ఏఎన్ఎం రత్నమాల, ఎంపీహెచ్ఏ పుల్లారావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.