4వ తరగతి విద్యార్థికి అ కూడా రాదా? ఎమ్మెల్యే ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
ఎమ్మెల్యే నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహన, అక్షర జ్ఞానం తదితర అంశాలను స్వయంగా పరీక్షించారు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బ్లాక్బోర్డుపై అక్షరం రాయాలని కోరగా, కనీసం ‘అ’ అక్షరం కూడా రాయలేకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కనీస అక్షర జ్ఞానం లేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు ఈ స్థాయిలో ఉండటం ఏమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రతి విద్యార్థి చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.