ఆహార భద్రతలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్లో అంగన్వాడీ టీచర్లకు శిక్షణా కార్యక్రమం
గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో, ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహార భద్రత శాఖ అధికారి వాసురాం, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం యొక్క నాణ్యతను ఆహార భద్రతా శాఖ అధికారులు నిరంతరం పరీక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, వాటిపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు లభించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ టీచర్లు తమ కేంద్రాల్లోని పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ నమోదు ధ్రువపత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు