ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
NTODAY NEWS :- రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నరసరావుపేటలోని ఓ ఎరువుల విక్రయ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల భౌతిక నిల్వలు, అమ్మకాల వివరాలు, ఈ-పాస్ నమోదు, స్టాక్ రిజిస్టర్లు, రైతులకు జారీ చేస్తున్న బిల్లులను పరిశీలించారు.
అనంతరం అక్కడకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్, ఎరువుల లభ్యత, విక్రయ విధానం, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఎరువుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిల్వలు మరియు అమ్మకాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని దుకాణ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు.