ఏ కొండూరు మండలంలో విషాదం....
ఏ కొండూరు మండలంలో విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలో పడి వాహనదారుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కుమ్మరికుంట్ల వద్ద ఘటన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొండూరు క్రాస్ రోడ్డు - విస్సన్నపేట ప్రధాన రహదారిలో కుమ్మరికుంట్ల వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.
నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి ద్విచక్ర వాహనంతో సహా ఓ వ్యక్తి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
మృతుడి వద్ద మద్యం సీసా లభించడంతో మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే అదుపుతప్పి బ్రిడ్జిలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఉదయం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.