పెనుగొలనులో హరికథా పితామహుడు నారాయణదాసు, కవి ఆరుద్ర జయంతి వేడుకలు
పెనుగొలనులో హరికథా పితామహుడు నారాయణదాసు, కవి ఆరుద్ర జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కవి ఆరుద్ర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఆదిభట్ల నారాయణదాసు 1864 ఆగస్టు 31న విజయనగరం జిల్లా బలిజపేట మండలం అజ్జాడ గ్రామంలో జన్మించారని తెలిపారు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియను అభివృద్ధి చేసి "హరికథా పితామహుడు"గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
సంస్కృతం, ఆంధ్ర భాషల్లో అనేక రచనలు చేసిన నారాయణదాసు గొప్ప రచయిత, కవి, బహుభాషా పండితుడు, తాత్వికుడని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ హరికథా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల ఆదరణ పొందారని తెలిపారు.
అనంతరం కవి ఆరుద్ర జయంతి సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆరుద్ర 1925 ఆగస్టు 31న విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో జన్మించారని తెలిపారు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అని వివరించారు.
తెలుగు సాహిత్యంలో ఆరుద్ర అభ్యుదయ కవిగా, పరిశోధకుడిగా, నాటక రచయితగా, అనువాదకుడిగా, సినీ గేయ రచయితగా విశేష సేవలు అందించారని కొనియాడారు. "త్వమేవాహం", "సినీ వాలి", "కూనలమ్మ పదాలు" వంటి రచనల ద్వారా సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రంగా వివరిస్తూ ఆరుద్ర రచించిన "సమగ్ర ఆంధ్ర సాహిత్యం" గ్రంథం తెలుగు భాషా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథమని తెలిపారు.
ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, మహిళా కమిటీ సభ్యులు దేవర అంజలి, దూదేకుల రంజాన్ బీ, దూదేకుల కరీంబీ, అంగన్వాడీ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.