ఏలూరు జిల్లాలో శాశ్వత ఎన్డీపీఎస్ కాంట్రాబాండ్ నిల్వ గది ప్రారంభం
మాదకద్రవ్యాలు, గంజాయి, నిషేధిత పదార్థాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
ఏలూరు, సెప్టెంబరు 9: ఏలూరు జిల్లా పరిధిలో ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాలను సురక్షితంగా భద్రపరిచేందుకు శాశ్వత కాంట్రాబాండ్ నిల్వ గదిని ఏర్పాటు చేశారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని ఏఆర్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈ నిల్వ గదిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ బుధవారం ప్రారంభించారు.
జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాలను పోలీసు స్టేషన్ వారీగా క్రమబద్ధంగా ఈ శాశ్వత నిల్వ గదిలో భద్రపరచనున్నారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని దివ్యాంగుల సంక్షేమ కార్యాలయానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక నిల్వ గదిలో భద్రపరిచిన పదార్థాలను కూడా నిర్ణీత విధి విధానాలను పాటిస్తూ కొత్త నిల్వ గదికి తరలించనున్నారు.
కొత్త నిల్వ గదిలో స్వాధీనం చేసిన పదార్థాల భద్రతకు అవసరమైన ప్రవేశ నియంత్రణ, పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు, క్రమబద్ధమైన నిల్వ విధానాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసిన మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల భద్రత, పర్యవేక్షణ, నిర్వహణ మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ మాట్లాడుతూ శాశ్వత కాంట్రాబాండ్ నిల్వ గది అందుబాటులోకి రావడంతో స్వాధీనం చేసిన నిషేధిత పదార్థాల భద్రత, పర్యవేక్షణ, నిర్వహణ మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై. ప్రసాద్ రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్తో పాటు రెవెన్యూ, పోలీసు, ఈగల్ విభాగం, నషా ముక్త్ భారత్ అభియాన్, రోడ్లు భవనాల శాఖ, ఇతర సంబంధిత జిల్లా స్థాయి శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.