డ్రంక్ అండ్ డ్రైవ్పై ఉక్కుపాదం.. నిందితుడికి జైలు శిక్ష, భారీ జరిమానా
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.11 వేల జరిమానా, 4 రోజుల జైలు
మదనపల్లె | Ntoday News
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి మదనపల్లె కోర్టు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనం నడిపిన సతీష్ కుమార్ రెడ్డికి రూ.11,000 జరిమానా, నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన నిమ్మనపల్లి ఎస్ఐ రామకృష్ణ, కోర్టు పీసీ రఫీలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.