చింతలపూడి : నిజం గెలిచింది.. ధర్మం నిలిచింది
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తులు వెలిగించి మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన నాటి పరిణామాలను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఆ క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబుకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
న్యాయం, ప్రజాస్వామ్యం, నిజం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడాయని తెలిపారు. అనంతరం ‘నిజం గెలిచింది.. న్యాయం గెలిచింది.. ధర్మం గెలిచింది’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చీకటి ఎన్ని రోజులు ఉన్నా.. చివరికి గెలిచేది నిజమేనని నాయకులు పేర్కొన్నారు.