ఏలూరు: ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం..
ఏలూరు: ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం.. రైతులకు సబ్సిడీలు అందిస్తున్న కేంద్రం
తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
MIDH పథకం కింద రక్షిత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలకు ఆర్థిక సాయం
ఏలూరు, జూలై 28: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిన్న, సన్నకారు రైతులు ఉద్యానవన పంటల సాగుతో పాటు రక్షిత సాగు విధానాలను అవలంబించేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉద్యానవన పంటలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం ఇస్తూ.. సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్ (MIDH) కింద రైతులకు ఆర్థిక సహాయం, సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
MIDH ద్వారా రక్షిత సాగు సాంకేతికతలు, సూక్ష్మ నీటిపారుదల, మల్చింగ్ విధానాలు, పాలీహౌస్లు, షేడ్ నెట్ హౌస్లు, ప్లాస్టిక్ టన్నెల్స్ వంటి ఆధునిక పద్ధతులపై రైతులకు సహాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.
రాష్ట్ర ఉద్యానవన మిషన్లు, సాంకేతిక సహాయక బృందాలు, ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు శిక్షణ, సాంకేతిక సూచనలు అందుతున్నాయని తెలిపారు.
స్వచ్ఛ మొక్కల కార్యక్రమం, ఉద్యానవన క్లస్టర్ అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఉద్యానవన మండలి నుంచి కూడా రైతులకు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇండో-ఇజ్రాయెల్, ఇండో-డచ్ సహకారంతో 61 పంటల వారీగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, పాలీహౌస్లు, షేడ్ నెట్ హౌస్ల వినియోగం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు పంటల దిగుబడిని పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఆధునిక సాగు విధానాలను పాటించాలని ఎంపీ కోరారు.