అమరావతి: ఆయుష్కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం
అమరావతి: ఆయుష్కు భారీ ఊతం.. రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఆయుష్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. మంత్రి సత్యకుమార్ చొరవతో రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ ఆయుష్ చరిత్రలో ఇదే తొలిసారి ఇంత భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికకు అనుమతి లభించింది.
2024-25 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరాల వరకు ఆయుష్ అభివృద్ధి కోసం మొత్తం రూ.434 కోట్ల కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో 2014-15 నుంచి 2023-24 వరకు పదేళ్ల కాలంలో ఆయుష్ రంగానికి కేవలం రూ.120.17 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు జరిగాయి.
కొత్తగా ఆమోదించిన నిధులతో ఆయుష్ వైద్య సేవల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సంప్రదాయ వైద్య సేవలు అందించే కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది. రాష్ట్రంలో ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.