ఏరువాకకు ఎల్నినో ఎఫెక్ట్.. ఖరీఫ్కు తొలి నెలలోనే భారీ షాక్!
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికే ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. జూన్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా భయానక వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్కు బలమైన పునాది వేసే జూన్లో ఈసారి రాష్ట్రంలో 63.19 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 79.24 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 29.17 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 17 జిల్లాలు అత్యల్ప వర్షపాతం కేటగిరీలోకి చేరాయి. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో 84.42 శాతం వర్ష లోటు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అన్నమయ్య, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా 80 శాతం కంటే ఎక్కువ వర్ష లోటు కనిపించింది.
నైరుతి రుతుపవనాలు ఐదు నుంచి ఆరు రోజుల ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించి కొద్దిరోజులకే బలహీనపడటంతో తొలకరి వానలు కరువయ్యాయి. దీంతో సాగు పనులు స్తంభించిపోయాయి. పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో మాత్రమే కొంత మెరుగైన పరిస్థితి కనిపించినా, అక్కడ కూడా సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 30 శాతం లోటు నమోదైంది.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్లోనే దాదాపు 80 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుంది. ఉద్యాన పంటలతో కలిపి సుమారు కోటి ఎకరాల్లో సాగు సాగుతుంది. కానీ సీజన్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో మొత్తం వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ప్రధాన జలాశయాల్లో కూడా నీటి నిల్వలు ఆశాజనకంగా లేవు. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 42 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, నాగార్జునసాగర్లో 312 టీఎంసీల సామర్థ్యానికి 138 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా డెల్టాకు ప్రస్తుతం పట్టిసీమ నీరే ప్రధాన ఆధారంగా మారింది. అయితే గోదావరి బేసిన్లో కూడా వర్షాలు లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, తక్కువ వ్యవధిలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. మరోవైపు గతేడాది వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో వర్షాలు కురవకపోతే సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.