భూపోరాట యోధుడు దాసరి నాగభూషణం
భూపోరాట యోధుడు దాసరి నాగభూషణం
నూజివీడు: కమ్యూనిస్టు ఉద్యమంలో భూమి, భుక్తి, విముక్తి కోసం జీవితాంతం పోరాడిన యోధుడు దాసరి నాగభూషణం అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు. నూజివీడులోని అమర్ భవన్లో దాసరి నాగభూషణం విగ్రహాన్ని చలసాని జగన్నాథరావు ఆవిష్కరించిన అనంతరం కొమ్మన నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో హరినాథ్ ప్రసంగించారు.
జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో దాసరి నాగభూషణం కీలక పాత్ర పోషించారని హరినాథ్ తెలిపారు. పేదలకు వేలాది ఎకరాల బంజరు, భూసీలింగ్ భూములు అందించేందుకు ఆయన రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేలాది మంది పేదలకు అటవీ భూములపై చెట్టు పట్టాలు మంజూరు చేయించడంలో దాసరి నాగభూషణం చేసిన కృషి మరువలేనిదన్నారు.
విద్యార్థి నాయకుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన దాసరి నాగభూషణం అనంతరం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, తనకు లభించిన నిధులను పేద ప్రజల సంక్షేమానికి వినియోగించారని హరినాథ్ తెలిపారు. ప్రస్తుతం మతోన్మాద, ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో వాటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే దాసరి నాగభూషణానికి అందించే నిజమైన నివాళి అని అన్నారు.
దాసరి నాగభూషణంతో పాటు చలసాని జగన్నాథరావు, కొల్లి నాగేశ్వరరావు నూజివీడు ప్రాంతంలోని పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని హరినాథ్ పేర్కొన్నారు.
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిజం అజేయమైన సిద్ధాంతమని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కార్ల్ మార్క్స్ రచించిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని నేటికీ పలువురు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. దాసరి నాగభూషణం గొప్ప పోరాట యోధుడే కాకుండా మంచి ఉపన్యాసకుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎందరో కార్యకర్తలు ఉద్యమంలో నాయకులుగా ఎదిగారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, అక్కినేని వనజ, చలసాని రామారావు, ధోనేపూడి శంకర్, వై. కేశవరావు, రవీంద్రనాథ్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, నిమ్మగడ్డ నరసింహ తదితరులు పాల్గొన్నారు.