చైతన్యనగర్ తండా ఆశ్రమ పాఠశాలలో వసతులపై సీపీఎం నేతల పరిశీలన
చైతన్యనగర్ తండా ఆశ్రమ పాఠశాలలో వసతులపై సీపీఎం నేతల పరిశీలన
ఏ.కొండూరు, ఆగస్టు 29: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలంలోని చైతన్యనగర్ తండా ఆశ్రమ బాలుర పాఠశాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సి.హెచ్. బాబూరావు, మండల నాయకులు ఆనందరావు, వెంకటేశ్వరరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించి, పలు అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ వసతి, వసతి గదులు, భోజన సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న భోజనం, విద్యా సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాలలో వసతుల కొరత ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించాలని కోరారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.