మునుకుళ్ళలో ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు
గిడుగు రామమూర్తి సేవలు తెలుగు భాషకు చిరస్మరణీయం
(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మునుకుళ్ళ)
వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలు అజరామరమని అరసం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్ పేర్కొన్నారు. గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాష వైపు తెలుగును మళ్లించి సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిన ఘనత గిడుగు రామమూర్తికే దక్కుతుందని అన్నారు.
భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునుకుళ్ళ ఉన్నత పాఠశాలలో తిరువూరు రచయితల సంఘం, అరసం ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు వ్యాసరచన, పద్య పఠన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష గొప్పతనం, భాష పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. మురళీకృష్ణ, ఉపాధ్యాయినులు నాగరత్న కుమారి, డి. లక్ష్మీ, టి. భరతకుమారి, వేణీ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.