గంపలగూడెంలో మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు అవగాహన కల్పించాలి
పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు : కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ విజ్ఞప్తి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం:
వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జిల్లా సమన్వయకర్త పద్మనాభుని మణిదీప్ కోరారు.
ఈ మేరకు శనివారం గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి టి.సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిదీప్ మాట్లాడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు సహజంగా నీటిలో కలిసిపోతాయని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని ఎంపీడీవోను కోరారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని మణిదీప్ విజ్ఞప్తి చేశారు.