చీరాల: బీసీల రాజకీయ సాధికారతకు కూటమి సర్కార్ నిర్ణయం చారిత్రాత్మకం
చీరాల: బీసీల రాజకీయ సాధికారతకు కూటమి సర్కార్ నిర్ణయం చారిత్రాత్మకం
34 శాతం గ్రామీణ, 33.33 శాతం పట్టణ బీసీ రిజర్వేషన్లకు బీజేపీ ఓబీసీ మోర్చా స్వాగతం
డాక్టర్ తాడివలస దేవరాజు.. బీసీలకు రాజకీయ అవకాశాలు మరింత పెరగాలి
బీసీ రిజర్వేషన్ల పెంపు సామాజిక న్యాయానికి నిదర్శనం: కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు
చీరాల, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్లో బీసీల రాజకీయ సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న 34 శాతం గ్రామీణ, 33.33 శాతం పట్టణ బీసీ రిజర్వేషన్ల నిర్ణయం చారిత్రాత్మకమని బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణ రావు సూచనతో చీరాలలోని పట్టణ బీజేపీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తాడివలస దేవరాజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు రిజర్వేషన్లు కీలకమైన అడుగుగా నిలుస్తాయని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు లభించే అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని, బీసీ కుటుంబాల నుంచి నాయకత్వం ఎదగాలని ఆకాంక్షించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అన్నారు. 28 జిల్లాలకు జిల్లా పరిషత్ల ఏర్పాటు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల ప్రతిపాదనలు స్థానిక ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
బీసీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్ల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో ఆయా వర్గాలకే అందేలా ప్రభుత్వం స్పష్టమైన విధానం రూపొందించాలని నాయకులు కోరారు. రిజర్వేషన్లు పెంచడం మాత్రమే కాకుండా వాటి ద్వారా బీసీ కుటుంబాల నుంచి రాజకీయ నాయకత్వం అభివృద్ధి చెందాలని తెలిపారు.
ఈ నిర్ణయం ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని, బీసీలకు లభించాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మువ్వల వెంకటరమణ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు, జిల్లా కార్యదర్శి పింజల భరణి రావు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు శంకరశెట్టి నాగేశ్వరరావు, ఓబీసీ జిల్లా ఐటీ కన్వీనర్ క్షత్రియ సుహాసిని భాయ్, సీనియర్ ఓబీసీ నాయకుడు గోలి మల్లికార్జునుడు, పట్టణ ఉపాధ్యక్షుడు అవ్వారు హనుప్రసాద్, ఓబీసీ సోషల్ మీడియా కన్వీనర్ రావు జగదీష్ సింగ్ పాల్గొన్నారు.