విస్సన్నపేటలో బీకేఎంయూ ఆధ్వర్యంలో ధర్నా..
విస్సన్నపేటలో బీకేఎంయూ ఆధ్వర్యంలో ధర్నా.. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ నిధులు ఇవ్వాలని డిమాండ్
విస్సన్నపేట: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) విస్సన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
గతంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం కల్పించాలని అన్నారు. అసైన్మెంట్ భూములను 22(ఏ) జాబితా నుంచి తొలగించి అసలైన వన్బీ రికార్డులు అందించాలని డిమాండ్ చేశారు.
పేద కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని త్యాగరాజు కోరారు. ప్రభుత్వం పేదల సమస్యలపై స్పందించి తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మర్సకట్ల త్యాగరాజుతో పాటు నందికొల్ల రాజేష్, జుజ్జువరపు దానయ్య, పితాని నాగేశ్వరరావు, వడిత్య కేశవరాజు, రాములు తదితర నాయకులు పాల్గొన్నారు.