పెనుగొలనులో స్వాతంత్ర్య సమరయోధుడు శివరామ్ హరిఱాజ్ గురు జయంతి వేడుకలు
పెనుగొలనులో స్వాతంత్ర్య సమరయోధుడు శివరామ్ హరిఱాజ్ గురు జయంతి వేడుకలు
ఘనంగా నివాళులు అర్పించిన శిరిడి సాయిబాబా సేవా కమిటీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు శివరామ్ హరిఱాజ్ గురు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. శివరామ్ హరిఱాజ్ గురు 1908 ఆగస్టు 24న మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ గ్రామంలో హరి నారాయణ రాజ్ గురు, పార్వతి బాయ్ దంపతులకు జన్మించారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు భగత్ సింగ్, సుఖ్దేవ్లతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
1928లో లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారులపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఫిరోజ్పూర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జే.పీ. సాండర్స్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని తెలిపారు. అనంతరం 1931 మార్చి 23న అప్పటి పాకిస్తాన్లోని లాహోర్ సెంట్రల్ జైలులో శివరామ్ హరిఱాజ్ గురు, ఆయన సహచరులు భగత్ సింగ్, సుఖ్దేవ్లను ఉరి తీశారని వివరించారు.
చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఇలాంటి మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులకు, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, వూటుకూరు యజ్ఞకృష్ణ, వీసం నరసింహ, దేవర అంజలి, ఇలా సాగరపు పూజిత, అంగన్వాడీ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.