చెకుముకి పోటీలను జయప్రదం చేయండి
చెకుముకి పోటీలను జయప్రదం చేయండి
- విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు వేదికగా చెకుముకి పోటీలు
తిరువూరు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి పోటీలు విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకత, పోటీ తత్వాన్ని అభివృద్ధి చేస్తాయని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ తెలిపారు.
స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జెవివి నాయకులతో కలిసి చెకుముకి గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వెల్లడించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు కలిపి ఒకే ప్రశ్న పత్రంతో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
పాఠశాల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు సెప్టెంబర్ 11న నిర్వహించే మండల స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. మండల స్థాయి పోటీ పరీక్షలు ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు.
చెకుముకి పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని జెవివి నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, నాయకులు రాం ప్రదీప్, సుధాకర్, శీనయ్య, సైదులు, శోభన్ బాబు, భరత కుమారి, విజయ్ కుమార్, సురేంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.