చింతలపూడి : అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
చింతలపూడి : అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు 06 మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరిపై కేసు నమోదు
చింతలపూడి, సెప్టెంబర్ 9: ఎక్సైజ్ నేరాల నియంత్రణలో భాగంగా చింతలపూడి మండలంలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు, తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 7న నిర్వహించిన తనిఖీల్లో భాగంగా కంచనగూడెం గ్రామంలో మాదాసి నాగరాజు వద్ద నుంచి 06 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, చింతలపూడి మండలంలో గతంలో నమోదైన సారా కేసులో నిందితుడిగా ఉన్న మాదాసి నాగరాజును 129 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, చింతలపూడి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తూ తహసీల్దార్ బైండోవర్ బాండ్ విధించారు.
అలాగే చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాలతో పాటు రెస్టారెంట్, బార్లలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం విక్రయాలను నిబంధనల ప్రకారం సురక్ష యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలని నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈ దాడులు, తనిఖీల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ అబ్దుల్ ఖలీల్, జె. జగ్గారావు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ సీఐ పి. అశోక్ వివరాలను వెల్లడించారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, అక్రమ సారా తయారీ, రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.