చింతలపూడిలో బొగ్గు సెగ.. డౌన్ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
భూసేకరణపై అనిశ్చితితో కొనుగోళ్లు, విక్రయాలకు బ్రేక్
భూముల భవిష్యత్పై స్పష్టత కోసం కొనుగోలుదారుల ఎదురుచూపులు
చింతలపూడి: బొగ్గు ప్రాజెక్టుల ప్రతిపాదనలు చింతలపూడి ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. బొగ్గు తవ్వకాలు, భూసేకరణ అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కొనుగోలు, విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు స్థానిక వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
గతంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో భూములు, ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిన వారు ప్రస్తుతం బొగ్గు ప్రాజెక్టుల ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో భూసేకరణ జరిగే అవకాశం ఉంది? ఎంత మేర భూములు ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి? పరిహారం ఎలా ఉంటుంది? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం కొనుగోలుదారులను వెనక్కి తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు.
లావాదేవీలకు తాత్కాలిక బ్రేక్
భవిష్యత్లో భూముల పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణంగా కనిపించే కొనుగోలు, విక్రయాలు మందగించిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ప్రకటనపైనే ఆశలు
బొగ్గు ప్రాజెక్టులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం వెలువడటంతో పాటు భూసేకరణ పరిధి, పరిహారం తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని వ్యాపారులు కోరుతున్నారు. ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగి, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని స్థానిక వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.