కాలుతున్న శవాల నుంచి మాంసం తిన్నాడంటూ వీడియో.. ‘అఘోర’ నందగిరి అరెస్ట్
ఉజ్జయిని: తనను తాను అఘోరగా చెప్పుకుంటూ, అఘోర ముసుగులో వికృత చర్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళీ అలియాస్ నందగిరిని ఉజ్జయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కేసుల్లో అరెస్టయిన నందగిరి.. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్’గా కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఉజ్జయినిలోని చక్రతీర్థ స్మశానవాటికలో మంగళవారం రాత్రి అనుమతి లేకుండా ప్రవేశించిన నందగిరి.. అక్కడ కాలుతున్న శవం నుంచి మాంసాన్ని కట్ చేసి తిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్మశానవాటిక కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నందగిరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
వికృత చర్యలను ఖండించిన మహామండలేశ్వర్
నందగిరి వ్యవహారంపై మహామండలేశ్వర్ శైలేశ్వరానందగిరి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వికృత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నందగిరి వంటి వ్యక్తులను సభ్య సమాజానికి దూరంగా ఉంచాలని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.