చిత్తపూరులో ఆధ్యాత్మిక సంబరం.. కంచి కామాక్షమ్మకు మహిళల ఘన సారె సమర్పణ
ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం శుక్రవారం భక్తిరసంతో ఉప్పొంగింది. గ్రామ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో మేళతాళాల నడుమ భారీ శోభాయాత్రగా తరలివచ్చి కంచి కామాక్షమ్మ అమ్మవారికి పట్టుచీరను సమర్పించి విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ భక్తి ప్రదర్శన గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించింది. మహిళలు శిరస్సుపై పండ్ల తాంబూలాలు ధరించి భక్తిగీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా సాగగా, గ్రామీణ డప్పు వాయిద్యాల మోతలు, మంగళ వాయిద్యాల నినాదాలు గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి.
అమ్మవారి దర్శనం కోసం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొనడంతో ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
"శ్రీ కంచి కామాక్షమ్మ తల్లికి జై" అంటూ మారుమోగిన నినాదాల మధ్య కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది.