శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి | ఎన్టుడే న్యూస్
వెల్లంకి గ్రామంలో శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడివాల మాచిదేవ స్వామి, ఈదమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రజక సంఘం కుటుంబ సభ్యులు సాంప్రదాయబడ్డంగా బోనాలు సమర్పించి స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను నెత్తిన ఎత్తుకుని వేడుకల్లో పాల్గొన్నారు. డప్పుల మోతలు, భక్తుల సందడితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ, తమ కులదైవాలైన శ్రీ మడివాల మాచిదేవ స్వామి, ఈదమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రజక సంఘం కుటుంబ సభ్యులు, పెద్దలు, యువతకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతల మధ్య బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి.