పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ
రిన్ సబ్బుతో గాయాలను శుభ్రం చేయడంపై డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆగ్రహం
అమలాపురం | Ntoday News
అమలాపురం జిల్లా హెడ్క్వార్టర్ ఏరియా ఆసుపత్రిలో పిచ్చికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారులను అమలాపురం అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ వైద్యులతో కలిసి పరామర్శించారు. అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులకు అందుతున్న చికిత్సను పరిశీలించిన డాక్టర్ పినిపే శ్రీకాంత్.. గాయాల సంరక్షణ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య విధానాలను పాటించకుండా రిన్ సబ్బుతో గాయాలను శుభ్రం చేస్తున్నట్లు కనిపించడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
చిన్నారుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వైద్య నిబంధనల ప్రకారం మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రిలో సరైన వైద్యం అందుతున్నదా లేదా అన్న విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు స్పందించాలని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ పినిపే శ్రీకాంత్ పేర్కొన్నారు.