కృష్ణారావుపాలెంలో డ్వాక్రా గ్రూపులో అవకతవకల ఆరోపణలు
లింకేజీ రుణం సొమ్ము రూ.3 లక్షలు స్వాహా చేశారంటున్న సభ్యులు
ఆరు నెలల పాటు బ్యాంకుకు చెల్లింపులు చేయకుండా జాప్యం.. వెలుగుశాఖ ఉన్నతాధికారులు విచారణ చేయాలంటున్న గ్రామస్తులు
చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో డ్వాక్రా సంఘానికి సంబంధించిన లింకేజీ రుణం విషయంలో అవకతవకలు జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, సంఘ సభ్యుల నుంచి రుణ వాయిదాల కోసం వసూలు చేసిన సొమ్మును సక్రమంగా బ్యాంకులో జమ చేయలేదని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు.
సభ్యుల వివరాల ప్రకారం.. ఓ డ్వాక్రా సంఘానికి సంబంధించిన లింకేజీ రుణం వాయిదాల కోసం సభ్యుల నుంచి ప్రతి నెలా సొమ్ము వసూలు చేశారు. అయితే సుమారు ఆరు నెలల పాటు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాము ఇంకా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందో తెలుసుకునేందుకు కొందరు సభ్యులు బ్యాంకును సంప్రదించగా, ఆరు నెలల పాటు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదని బ్యాంకు సిబ్బంది తెలిపినట్లు సభ్యులు చెబుతున్నారు.
దీంతో సభ్యులు మాజీ ప్రజాప్రతినిధిని నిలదీయగా, చెల్లింపులు చేయడం మరిచిపోయానని చెప్పినట్లు ఆరోపించారు. అనంతరం జూలై, ఆగస్టు నెలల్లో కలిపి సుమారు రూ.3 లక్షలు బ్యాంకులో జమ చేసినట్లు సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉందని వారు చెబుతున్నారు.
గ్రామంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రజాప్రతినిధి డ్వాక్రా సంఘం సొమ్ము విషయంలో ఇలా వ్యవహరించారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. సంఘ సభ్యులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, సంబంధిత వ్యక్తి గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో బహిరంగంగా మాట్లాడేందుకు కొందరు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. సంఘ ఖాతాలు, బ్యాంకు లావాదేవీలు, సభ్యుల నుంచి వసూలు చేసిన మొత్తాలు, రుణ వాయిదాల చెల్లింపులపై సమగ్రంగా తనిఖీ చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సభ్యుల సొమ్ముకు పూర్తి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై వెలుగు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడతారా.. లేక ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.