కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం
50:50 కోరుతున్న తెలంగాణ.. 66:34 కొనసాగించాలని ఏపీ డిమాండ్
హైదరాబాద్ | Ntoday News
కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది.
తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపుపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఈ అంశాన్ని సెప్టెంబర్ నాలుగో వారంలో నిర్వహించనున్న KRMB పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ వాదన 50:50
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను తాగునీటి అవసరాలకు 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ కోరింది. మొత్తం 200 టీఎంసీల నీరు అవసరమని ప్రతిపాదించింది.
66:34 నిష్పత్తిని గత మూడేళ్లుగా తెలంగాణ అంగీకరించడం లేదని తెలంగాణ ENC రమేష్బాబు పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తోందని, ప్రస్తుతం వెలిగొండ ద్వారా కూడా నీటిని తీసుకుంటోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఏపీ వాదన 66:34
మరోవైపు పాత విధానం ప్రకారం ఏపీ, తెలంగాణకు 66:34 నిష్పత్తిలోనే నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. వచ్చే ఆగస్టు వరకు తమకు 104 టీఎంసీల నీరు అవసరమని ఏపీ ENC నరసింహమూర్తి తెలిపారు. తెలంగాణ కోరుతున్న 200 టీఎంసీల ప్రతిపాదన సహేతుకం కాదని పేర్కొన్నారు.
పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీ తన వాటాకు సంబంధించిన నీటినే వినియోగిస్తోందని, తెలంగాణ వాటాను కోరడం లేదని ఏపీ స్పష్టం చేసినట్లు సమాచారం. రాయలసీమతో పాటు మార్కాపురం, పల్నాడు తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలను కూడా తీర్చాల్సి ఉందని పేర్కొంది.
అదేవిధంగా అవసరం లేకున్నా తెలంగాణ శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇలా 50:50 నిష్పత్తి కావాలని తెలంగాణ.. 66:34 కొనసాగించాలని ఏపీ పట్టుబడుతున్న నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అంశం తుది నిర్ణయం కోసం KRMB పూర్తిస్థాయి బోర్డు సమావేశానికి చేరింది. శ్రీశైలం జలాశయంలోకి ఇన్ఫ్లోలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.