విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: మోదీ
డ్రగ్స్ వ్యసనానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలి.. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ | Ntoday News
యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనంపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 82 మంది ఉపాధ్యాయులు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని మోదీ సూచించారు.
విద్యార్థులను క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పిల్లల్లో పెరుగుతున్న అధిక స్క్రీన్ టైమ్ ఆందోళన కలిగించే అంశంగా మారుతోందని మోదీ అన్నారు. తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తూ విద్యార్థుల మొబైల్ వినియోగాన్ని తగ్గించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.
విద్యార్థుల చదువుతో పాటు వారి మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రవర్తనపై కూడా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ప్రధాని సూచించారు.