అమరావతి : ఏపీలో 28 జిల్లా పరిషత్లు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా ప్రత్యేక జిల్లా పరిషత్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని కొత్త జిల్లాల పరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా జిల్లా పరిషత్ల సంఖ్య కూడా పెరగనుంది.
కొత్త జిల్లా పరిషత్ల నిర్వహణ కోసం అదనంగా 15 జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, 15 ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారుల పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన 28 జిల్లా పరిషత్ల వ్యవస్థ అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలన మరింత వికేంద్రీకృతం కానుంది.